- సేవాలాల్ సేనా నాయకుల డిమాండ్
- సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సేవాలాల్ సేనా మద్దతు
భద్రాద్రి జిల్లా ప్రతినిధి, జనవరి 05 (తెలంగాణ కెరటం): సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సేవాలాల్ సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిర్వహిస్తున్న దీక్షలకు సేవాలాల్ సేనా తరుపున ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ్ నాయక్ మాట్లాడుతూ.. పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి వారి సమస్యలను టీ తాగినంత సమయంలోనే పరిష్కరిస్తామని చెప్పారని.., ఇప్పడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది గడుస్తున్నప్పటికీ వారి సమస్యలు సీఎంకు పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీ ఇచ్చినప్పుడు తెలియదా.. ఆ సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉద్యోగుల తరుపున సేవాలాల్ సేన పోరాడుతుందని అన్నారు. అనంతరం సేవాలాల్ సేనా రాష్ట్ర కో కన్వీనర్ బాణోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ… సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు వర్ణనాతీతమని, వారి పోరాటంలో న్యాయం ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఇప్పటికైనా స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేనా కో కన్వీనర్ లకావత్ భాస్కర్ నాయక్, సేవాలాల్ సేనా ఉద్యోగుల సంక్షేమ శాఖ రాష్ట్ర నాయకులు బాలకృష్ణ, చౌహాన్, బాబులాల్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.