తెలంగాణ జనసమితిలో లోపించిన ప్రజా స్వామ్యం

ఖమ్మం జిల్లా రూటే సపరేటు

తెలంగాణ జనసమితిలో లోపించిన ప్రజా స్వామ్యం

  • ఏకపక్షంగా జిల్లా కమిటీ ప్రకటన
  • స్పందించని అధినేత
  • – యండి. షఫీ యు జమ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

ఖమ్మం, మార్చి 06 (తెలంగాణ కెరటం): రాష్ట్ర రాజకీయాలలో మొదటి నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాలు… రూటే సపరేటు అన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతం తెలంగాణ జనసమితిలో లోపించిన ప్రజా స్వామ్యాన్ని అద్దం పట్టింది. ఏకపక్షంగా జిల్లా కమిటీ ప్రకటన ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగా ఈ అంశంపై జిల్లా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కొదండరాం స్పందన కోసం ఎదురు చూసిన ఆ పార్టీ శ్రేణులకు ఆయన స్పందించిన తీరు దీనిపై స్పందించాల్సిన స్పందన తీరులో లేదని ఆ పార్టీ వర్గాలు, నాయకులు, కార్యకర్తల నుంచి విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా తెలంగాణ జనసమితి జిల్లా కమిటీని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ చార్జ్ హోదాలో ఒక రాష్ట్ర నాయకుడు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లా కమిటీ ఎన్నిక అన్నివర్గాలను కలుపుకుని సంప్రదింపులు జరిపి, ప్రకటించాల్సి ఉండగా అంతకుముందు ఉన్న కమిటీకి ఏ విధమైన సమాచారం లేకుండగా నూతన జిల్లా కమిటీని ప్రకటించారని ప్రస్తుత జనసమితిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ విషయం రాష్ట్ర అధ్యక్షునికి సైతం తెలియదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజ నిజాలు పక్కన పెడితే ఈ విషయంపై జిల్లా ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్న రాష్ట్ర నాయకుడికి నూతన జిల్లా కమిటీని ప్రకటించే అధికారం కూడా లేదని ఆయా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఏ జిల్లాకు చెందిన వారిని అదే జిల్లాకు ఇన్ చార్జ్ గా నియమించడం ఎక్కడా కూడా సాధారణంగా ఉండదు. ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్యం, ప్రజా స్వామ్య పరిరక్షణ అనే ఊకదంపుడు నినాదాలు మాత్రమే చేసే కార్యక్షేత్రంలో కనిపించని తెలంగాణ జనసమితిలో లోపించిన ప్రజా స్వామ్యానికి మరో సాక్షి భూతం ఇది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 2న ఖమ్మంలో జరిగిన ఓ సమావేశంలో తెలంగాణ జనసమితి ఖమ్మం జిల్లా శ్రేణులు బాబు అనే జనసమితి జిల్లా కన్వీనర్ ను యదావిధిగా కొత్త జిల్లా కమిటీని ప్రకటించేవరకు కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇదే ఫిబ్రవరి 21 వ తేదీన నూతన జిల్లా కమిటీని ఏకపక్షంగా ప్రకటించారు. ఈ నూతన జిల్లా కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇంటి పార్టీకి వెళ్లి మళ్లి తిరిగి తెలంగాణ జనసమితికి చేరాడు. దీనిపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నా కూడా రాష్ట్ర అధ్యక్షుడు సత్వర నిర్ణయం తీసుకోకపోవడం పట్ల పార్టీ శ్రేణులు అసంత్రుప్తిని ప్రకటిస్తున్నాయి.

జనం లేని తెలంగాణ జనసమితి..
ఇప్పటికే తెలంగాణ జనసమితి జనంలేని తెలంగాణ జనసమితిగా మారిందని, ప్రజల నుంచి, పార్టీ సాధారణ కార్యకర్తల నుంచి విమర్శలు ముటగట్టుకుంటున్నప్పటికీ తెలంగాణ జనసమితి తీరు మారకపోవడంపై పరిశీలకులు విస్మయం చెందుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పట్టుమని పదిమంది లేని తెలంగాణ జనసమితికి ఆ పదిమంది కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరో కొత్త కమిటీ ఆవిర్భవిస్తే..
ప్రజల కోసం, ప్రగతి కోసం, అవినీతి నిర్మూలన కోసం, ప్రజా స్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి ఉదాత నినాదాలతో ఆవిర్భవించి అందుకు విరుద్దంగా ప్రయాణం చేస్తున్న తెలంగాణ జనసమితి పట్ల ఇప్పటికే తీవ్ర అసంత్రుప్తితో ఆగ్రహంతో ఉన్న కొద్దిపాటి తెలంగాణ జనసమితి శ్రేణులు నూతన జిల్లా కమిటీకి ప్రత్యామ్నాయంగా మరో కొత్త జిల్లా కమిటీని ప్రకటించుకుంటే ఉన్న తెలంగాణ జనసమితి కొద్దిపాటి విలువను కూడా కోల్పోక తప్పదని ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మరో జిల్లా కమిటీ కూడా ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పటికైనా స్పందిస్తారా లేదా అనే దానిని కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

కొసమెరుపు..
తెలంగాణ జనసమితి సభ్యత్వం ఉన్నా.. లేకున్నా.. తెలంగాణ జనసమితిలో చేరిన వెంటనే ముఖ్యంగా కొత్తవారికి పదవులు దక్కుతాయి అనే నానుడి తెలంగాణ జనసమితిలో ఉంది. అదే విషయం నూతన జిల్లా కమిటీ ప్రకటనతో వాస్తవ రూపం దాల్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment