భూముల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి
👉🏻ఎమ్మెల్యే
మదన్ మోహన్.
అటవీ భూముల సరిహద్దులకు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి పరిష్కారం చేయాలి
తెలంగాణ కెరటం
19 డిసెంబర్
ఎల్లారెడ్డి ప్రతినిధి
అటవీ భూముల ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి, మదన్ మోహన్.
అటవీ భూముల సరిహద్దులకు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి గిరిజన ప్రజలకు మరియు అటవీ అధికారులకు మధ్య తరచుగా వివాదాలు ఉత్పన్నమవుతున్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనవలసిన శాశ్వత పరిష్కారం కోసం ఈ సమస్యను సభ దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఈ సమస్య విషయంలో ప్రత్యేకంగా మా ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని చాలా మండలాల ప్రజలు విభిన్న రకాల సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీసీ రైతులు గత 30 ఏళ్ల నుండి అటవీ భూముల సరిహద్దులకు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో కాస్తులో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. వారు బీసీ సామాజిక వర్గానికి చెందినందున వారికి గతంలో పట్టాలు జారీ చేయబడలేదు. కానీ ఇన్నేళ్లుగా వారిని ఏమనని అటవీ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర పాలనా కాలం నుంచి వారిని అక్కడ వ్యవసాయం చేయకుండా ఆ భూముల నుంచి ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనివలన కాంగ్రెస్ పార్టీ కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.
రాజంపేట మండలం ఎల్లాపూర్ తండా, హద్దు గుండు తండాలకు చెందిన చాలా మంది రైతులకు ఆర్ ఓ ఫ్ ఆర్ పట్టాలు వచ్చినప్పటికీ, కొంతమంది గిరిజన రైతులకు కొన్ని సాంకేతిక కారణాలతో ఆర్ ఓ ఫ్ ఆర్ పట్టాలు జారీ చేయబడలేదు. దీంతో ఈ రైతులను కూడా అటవీశాఖ అధికారులు వ్యవసాయం చేయనివ్వడం లేదు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలానికి చెందిన లింగంపేట, తాండూరు గ్రామాలలో సుమారుగా ప్రభుత్వ అసైన్డ్ భూమి 600 ఎకరాలలో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఎల్ ఆర్ యు పి కంటే ముందు ఈ రైతులకు పాత పాసు బుక్కులు ఉన్నాయి, వాటి మీద రుణాలు మంజూరు చేశారు, ఈ భూముల మీద యాజమాన్య హక్కులు సైతం రైతులు కలిగి ఉన్నారు. ఈ ఎల్ ఆర్ యు పి కార్యక్రమం నిర్వహించి కొత్త పాస్ బుక్కులు ఎప్పుడైతే జారీ చేశారో, ఈ సంబంధిత రైతులకు కొత్త పాస్ బుక్కులు జారీ చేయబడలేదు. అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఈ రైతులకు నూతన పాసు బుక్కులు జారీ చేయలేదని రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ భూములలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు రైతు భరోసా పొందడం లేదు,
రైతు బీమా, రుణమాఫీ వంటి ఈ వ్యవసాయ సంబంధిత పథకాలకు అర్హులు కావడం లేదు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం గౌరారం గ్రామంలో 627 సర్వే నెంబర్ లో సుమారుగా 370 ఎకరాల విస్తీర్ణం ప్రభుత్వ అసైన్డ్ భూమిలో 210 మంది రైతులకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టా పాస్ బుక్ లు జారీ చేశాయి. ఈ రైతులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్ బుక్ ల ద్వారా యాజమాన్య హక్కులను అనుభవించడంతోపాటు పంట రుణాలను తీసుకోవడంతో పాటు వివిధ వ్యవసాయ సంబంధిత సంక్షేమ పథకాలను అనుభవించారు. ఇంతకుముందు చెప్పినట్టు గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఎల్ ఆర్ యు పి కార్యక్రమం తర్వాత ఈ రైతులకు సైతం నూతన పట్టా పాస్ బుక్ లు జారీ చేయబడలేదు. ఈ 370 ఎకరాల భూమిని మా భూమి అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కాదు మా భూమి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇలా రెండు ప్రభుత్వ శాఖల మధ్య నలుగుతూ ఆ రైతులు నష్టపోతున్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ లింగంపేట మండలానికి చెందిన నల్ల మడుగు తండాకు చెందిన గిరిజన రైతు లక్ష్మణ్ నాయక్ తాను 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడుభూమికి ఆర్ ఓ ఫ్ ఆర్ పట్టాల పాస్ బుక్ రాకపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంబంధిత పట్టా పాస్ బుక్ రాకపోతే అడవి అధికారుల ఇబ్బందులతో వ్యవసాయం చేసుకోవడం కష్టం కాబట్టి.
ఎల్లారెడ్డి నియోజకవర్గ లింగంపల్లి మండలం ఎక్కపల్లి తండా మరియు ఇతర మండలాల్లో సైతం ఆర్ ఓ ఫ్ ఆర్ పట్టాల ద్వారా రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో మడులు కట్టనీయకుండా, పైప్ లైన్ వేయకుండా, బోర్లు వేయకుండా, ట్రాక్టర్ తో దున్నకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. దీనివలన ఈ వ్యవసాయ భూములన్నీ నిరూపయోగంగా మారి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి.
ఏల్లరెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో ఉన్న కాయితి లంబాడాలు బీసీ సామాజిక వర్గం పరిధిలోకి వస్తారు. దీంతో వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వము (ఆర్ ఓ ఎఫ్ ఆర్) పట్టాలను జారీచేయ లేదు. దీంతో కాయితి లంబాడాలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకి యాజమాన్య హక్కులు లేక అన్యాయమైపోతున్నారు.
మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చాలావరకు తాండాలు అటవీ భూముల సమీపంలోనే ఉంటాయి. అయితే ఈ తాండాలకు చెందిన లంబాడాలు నూతన ఇండ్లు నిర్మించుకున్నప్పుడు. అటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలిపి ఇండ్లు నిర్మించుకోనివ్వడం లేదు. అలాగే గత 30, 40 ఏండ్ల నుంచి ఉన్న గుడులను సైతం అభివృద్ధి చేసుకొని ఇవ్వడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యలన్నింటిని పరిగణలోకి తీసుకొని ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్న అన్ని గ్రామాలలో రెవెన్యూ మరియు అటవీశాఖ అధికారులతో జాయింట్ సర్వే ను నిర్వహించి వివాదాలు లేకుండా భూమి హక్కులను రైతులకు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను.
అలాగే ఆర్ఓఎఫ్ పట్టాలు ఇచ్చిన భూములలో నీటి సదుపాయం కోసం బోర్లు వేసుకునే విధంగా, పైపులైను వేసుకునే విధంగా, అధునాతన వ్యవసాయ పనిముట్లతో వ్యవసాయం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించుకుంటున్నాను.
అదేవిధంగా తండాలలో గిరిజనుల ఇండ్ల నిర్మాణాలకు అటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో గిరిజన లంబాడాలు లబ్ధి పొందకుండా ఉండిపోతారు, కావున ఈ తాండాలలో ఇండ్ల నిర్మాణానికి అభ్యంతరం తెలుపకుండా అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.