భూత్పూర్ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం

భూత్పూర్ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం

 

గ్రామస్తులకు పునరావసంపై వారం రోజులలో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తాం,

 

ఇలాంటి దుర్భర మైన జీవితం గడపడం చాలా బాధగా ఉంది,

 

—- ఆబ్కారీ , పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.

 

 

తెలంగాణ కెరటం నారాయణ పేట ప్రతినిధి,

 

 

ఇందిరమ్మ రాజ్యంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మక్తల్ మండలం భూత్పూర్ ముంపు బాధిత గ్రామ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తుందని ఆబ్కారీ, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు మక్తల్ మండలంలోని భూత్పూర్ ముంపు గ్రామాన్ని పరిశీలించారు. గ్రామంలో ఇల్లిలు తిరిగి గ్రామస్తులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను చూసి చలించిపోయారు. ముంపు గ్రామాంలో ప్రజల దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని, ఇళ్ళల్లో పాములు, తేళ్లు, ఊరి మధ్య బావిలో మొసలి ఉన్నా.. ప్రాణాపాయ స్థితిలో గ్రామస్తులు దినదిన గండంగా బతుకుతున్నారని స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రికి వివరించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తాను 24 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నానని, కానీ ఇంతటి హృదయ విషాదకర వాతావరణo కలిగిన గ్రామాన్ని ఎక్కడ చూడలేదన్నారు. 20 ఏళ్లుగా ఇలాంటి దుర్బర స్థితిలో జీవనం సాగిస్తున్న గ్రామస్తుల ఓపికకు దండం పెడుతున్నానన్నారు. ఈ పరిస్థితి నుంచి తక్షణమే బయటపడాల్సిన అవసరం ఉందని, మన జిల్లా నాయకుడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, రాష్ట్రంలో దేశంలో ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం తమదన్నారు. ప్రజల బాధలు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ తో భూత్పూర్ ముంపు గ్రామం గురించి మాట్లాడానని మంత్రి తెలిపారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో గుర్తించి ఒక కుటుంబానికి 200 గజాలకు తగ్గకుండా 30 ఫీట్ల రోడ్డుతో కలిపి ఎన్ని ఎకరాల స్థలం అవసరమో గుర్తించి వెంటనే భూసేకరణ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలం ను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ తో చర్చించి ఈ వారంలోనే భూత్పూర్ ముంపు గ్రామంపై సమీక్ష చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. భూత్పూర్ ముంపు గ్రామ ప్రజల విషయంలో తాము పట్టు వదలని విక్రమార్కుడిలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల పాటు తమకు పనిచేసే సమయం దొరకలేదని, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు, రెండు పర్యాయాలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగడంతో సమయం దొరకలేదని తెలిపారు. భూత్పూర్ ముంపు గ్రామ ప్రజల సమస్య పరిష్కారం విషయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎంతో తపనతో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తో సన్నిహితంగా ఉంటారని మంత్రి తెలిపారు. కొత్త సంవత్సరంలో శుభాకాంక్షలు తెలపలేని పరిస్థితి ఉందని, ఇక్కడంతా అశుభమే కనిపిస్తోందని, ఈ కొత్త సంవత్సరంలో మీ కష్టాలు తీరుతాయని, మరోసారి గ్రామానికి వచ్చి శుభాకాంక్షలు చెబుతానని, మీ కష్టాలు ఈ కొత్త సంవత్సరంలో తీరాలని మంత్రి ఆకాంక్షించారు. కాగా అంతకుముందు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ 20 ఏళ్లుగా ముంపు గ్రామాన్ని చూడడానికి ఏ మంత్రి రాలేదని, తొలిసారిగా మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారని, ఇక్కడి ప్రజల జీవన దుస్థితిని చూసిన ఆయనకు కళ్ళల్లో నీళ్ళు తిరిగే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. తాను ఈ ఎన్ సీ లో మాట్లాడితే మంత్రి నిజమా అని అడిగారని, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా గ్రామంలో తిరిగిన మంత్రి కి ప్రజల పరిస్థితి అర్థమైందని తెలిపారు. 120 జీవో పెండింగ్ పడిందని, ఇది వరకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా ఈ ముంపు గ్రామాన్ని చూపించడం జరిగిందన్నారు. వార్ పుట్టింగ్ తో గ్రామాన్ని గట్టెక్కించాలని మంత్రిని కోరారు. —————————————-

Join WhatsApp

Join Now

Leave a Comment